డైలీ మిర్రర్ డాట్ న్యూస్,అమరావతి, డిసెంబర్ 10,2024: రేపటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరుగనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధ, గురువారాల్లో ఈ సదస్సు జరగనుంది.

ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, నూతన పాలసీలు తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న నాలుగున్నరేళ్లలో ఏ విధమైన లక్ష్యాలు సాధించాలన్న దిశగా ఈ సమావేశంలో చర్చ జరుగనుంది.

26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులు ఈ సదస్సులో పాల్గొని, తమ అభిప్రాయాలను సీఎం కు తెలియజేయనున్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే కలెక్టర్లతో సమావేశం నిర్వహించగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రెండవ సారి ఈ సమావేశం నిర్వహించబడుతోంది.

సమావేశం మొదటి రోజు ఆర్టీజీఎస్, వినతుల పరిష్కారం, గ్రామ-వార్డు సచివాలయాలు, వాట్సాప్ గవర్నెన్స్, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ తదితర అంశాలపై చర్చ జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి వ్యవసాయం, పశుసంవర్ధక వ్యవసాయం, హార్టీకల్చర్, పౌర సరఫరాలు, అడవులు, జలవనరులు, పంచాయతీరాజ్, నరేగా, రూరల్ వాటర్ సప్లై, సెర్ప్, పట్టణాభివృద్ధి, సీఆర్డీయే, శాంతి భద్రతలపై ప్రత్యేకంగా చర్చించబడుతుంది.

రెండో రోజు పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్, విద్యుత్, మానవ వనరులు, ట్రాన్స్ పోర్ట్, రోడ్లు-భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, రెవిన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఐపీఎస్ అధికారులు కూడా పాల్గొంటారు.