365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 27,2024: డాక్టర్ మన్మోహన్ సింగ్‌ నాకు అత్యంత ఆప్తుడు. మేమిద్దరం అన్నదమ్ముల్లా ఉండేవాళ్లం. ఇటీవల నేను (చింతామోహన్), నా భార్య చింతా రేవతి, డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆయన భార్య కలిసి ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యాం.

అప్పుడు మన్మోహన్ సింగ్ నాతో మాట్లాడుతూ, “నా మనవడు అమెరికాలో ఉన్నాడు. వాడికి పెళ్లి కాలేదు. సంబంధం చూడండి. ఏ కులమైనా ఓకే” అని అన్నారు.

2004లో మన్మోహన్ సింగ్‌ను ప్రధానమంత్రిగా నియమించడానికి కమ్యూనిస్టులు వ్యతిరేకించారు. కానీ, నేను కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్ గారితో మాట్లాడి వారిని ఒప్పించాను.

మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త అని అందరూ అంటుంటారు. అయితే, “ఆయన మంచి రాజకీయవేత్త” అని అర్జున్ సింగ్ నాతో అన్నారు. “నిన్ననే ప్రధాని అయ్యారు, కానీ నేను కాలేకపోయాను” అని కూడా అర్జున్ సింగ్ తెలిపాడు.

యూపీఏ హయాంలో డాక్టర్ మన్మోహన్ సింగ్‌ నన్ను మూడుసార్లు కేంద్ర మంత్రిగా చేయాలని ప్రయత్నించారు. కానీ వైఎస్ఆర్ అడ్డుపడ్డారు.

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమానికి 10,000 మందితో మీటింగ్ చేస్తే అసూయపడతారని, కేవలం 500 మందితో నిర్వహించమని మన్మోహన్ సింగ్ సూచించారు.

ఒక చిన్న ఎంపీగా, దళిత వర్గం నుంచి వచ్చిన నేను, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇచ్చిన మద్దతుతో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయల గ్రాంట్ తెచ్చాను.

అంతర్జాతీయ విమానాశ్రయం, మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, ఏడు జాతీయ రహదారులు, సిమ్స్‌కు ఎయిమ్స్ హోదా, 65 కోట్ల రూపాయల గ్రాంట్, 292 కోట్ల రూపాయలతో 7,008 నిరుపేద మహిళలకు ఇళ్లను సాధించాను.

1991లో నేను పీవీ నరసింహరావు క్యాబినెట్‌లో ఎరువుల శాఖ మంత్రిగా, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

తిరుపతితో డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. 45 ఏళ్ల క్రితం ఎస్వీ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.

మన్మోహన్ సింగ్ భార్య స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ కూరగాయల మార్కెట్‌కి వెళ్లి, అవసరమైన సరుకులు తీసుకొచ్చేవారు.

భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసిన ఘనత మన్మోహన్ సింగ్‌దే. ఆయనతో పాటుగా మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీలను మాత్రమే ఈ ఘనతకు సరిపోల్చగలం.

పదేళ్లు ప్రధానమంత్రిగా పనిచేసినా, ఆర్థిక మంత్రిగా పనిచేసినా చిన్న మచ్చ లేకుండా గడిపిన మన్మోహన్ సింగ్ లాంటి నాయకులు నేడు అవసరం.

చింతామోహన్ మరియు కాంగ్రెస్ నేతలు డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపీ గౌడ్, రవి, తేజోవతి, శాంతి యాదవ్, ముని శోభ, రావణ్, అబ్దుల్ మజీద్ పటేల్, సమీ ఉల్లా, వెంకటేశ్ గౌడ్, భాగ్యరాజు, బాల, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.