
డైలీ మిర్రర్ డాట్ న్యూస్, విశాఖపట్నం, జూన్ 14, 2025: వివిధ కారణాల వల్ల మోకాళ్లలో గాయాలు అయ్యి లోపలి భాగంలో ఉండే మెనిస్కస్, లిగమెంట్లు టేర్ అవుతాయి. వాటివల్ల వెంటనే తెలియకపోయినా దీర్ఘకాలంలో మోకాళ్లు త్వరగా అరిగిపోతాయి.
రోడ్డు ప్రమాదాలు, క్రీడల్లో అయ్యే గాయాలు, ఇంట్లో జారిపడడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. ఈ తరహా సమస్యలపై వైద్యులకు, సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు విశాఖపట్నంలోని సీతమ్మధార కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన ఫోర్ పాయింట్స్ బై షెరటాన్ హోటల్లో ఒక రోజు సదస్సు నిర్వహిస్తున్నారు.
ఉత్తరాంధ్ర ఆర్థ్రోస్కొపిక్ అసోసియేషన్, వైజాగ్ ఆర్థ్రోస్కొపిక్ అసోసియేషన్ల సహకారంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. కేజీహెచ్ ఆర్థోపెడిక్ విభాగాధిపతి, ఆంధ్రా వైద్యకళాశాల అధ్యాపకుడు డాక్టర్ శివానంద ఈ సదస్సుకు ఛైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు.
నిర్వాహక బృందంలో డాక్టర్ శ్రీనివాస్ గొల్లంగి, డాక్టర్ ఆర్. రాజేష్ కుమార్ రెడ్డి, డాక్టర్ సంతోష్ రాం గడ్డం తదితరులు ఉన్నారు. దీనికి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్న 150 మంది ఆర్థోపెడిక్ వైద్యులు హాజరవుతున్నారు. వీరందరికీ కొత్త టెక్నిక్ల గురించి చెప్పేందుకు అహ్మదాబాద్, కోయంబత్తూరు లాంటి నగరాల నుంచి పలువురు అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు హాజరవుతున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ సదస్సులో ప్రధానంగా మెనిస్కస్, లిగమెంట్ గాయాలను ఆర్థ్రోస్కొపీ అనే చిన్నపాటి శస్త్రచికిత్స ద్వారా ఎలా నయం చేయొచ్చన్న విషయాలపై చర్చిస్తారు. వీటిలో ప్రధానంగా మెనిస్కల్ ట్రాన్స్ప్లాంట్లు, కార్టిలేజ్ రిపేర్ టెక్నిక్లు, ఇంకా ఎన్నో ఉంటాయి. వాటితోపాటు ఆర్థ్రోస్కొపీలో వస్తున్న ఆధునిక పరిణామాలనూ వివరిస్తారు.

ఈ కార్యక్రమం వివరాలను డాక్టర్ శ్రీనివాస్ గొల్లంగి, డాక్టర్ ఆర్. రాజేష్ కుమార్ రెడ్డి, డాక్టర్ సంతోష్ రాం గడ్డం వివరిస్తూ,“జీవనశైలి మార్పులు, తగినంత వ్యాయామం ఉండకపోవడం, ఊబకాయం, అధిక బరువు లాంటి కారణాలతో పాటు రోడ్డు ప్రమాదాలు, క్రీడల్లో అయ్యే గాయాల వల్ల కూడా మోకాళ్లలోని లిగమెంట్లు, మెనిస్కస్ గాయాలు అవుతాయి.
20లు,30లలో ఉండేవారికి కూడా ఇవి సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. వీటికి సకాలంలో చికిత్స తీసుకుంటే దీర్ఘకాలంలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. లేకపోతే దీర్ఘకాలం పాటు నొప్పి, కీళ్ల అరుగుదల లాంటి సమస్యలు వస్తాయి” అని తెలిపారు.