
డైలీమిర్రర్ డాట్ న్యూస్,23నవంబర్,2024:తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు టిటిడి ఈవో శ్యామల రావు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు వెల్లడించారు. శనివారం తిరుచానూరులోని పసుపు మండపం నుంచి పుష్కరిణి, ఆలయ వీధుల్లో తిరుపతి టిటిడి జేఈవో వీరబ్రహ్మం, సివీఎస్వో శ్రీధర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తదితర అధికారులు కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, నవంబర్ 28 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు వంటి ఇంజినీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలయం,పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పిఏ సిస్టమ్, ఎల్ఇడి తెరలను ఏర్పాటు చేయాలన్నారు.

హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాబృందాలతో ఆకర్షణీయమైన ప్రదర్శనలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులను ఆకట్టుకునే విధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు.
శుక్రవారపు తోటలో పుష్పప్రదర్శనలతో పాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టాలని ఈవో సూచించారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో పంచమితీర్థం సందర్భంగా మెరుగ్గా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, తోళప్ప గార్డెన్స్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే, పోలీసు, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా, శాంతిపూర్వక వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని ఈవో తెలిపారు.
ఈ సమావేశంలో టిటిడి ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, చీఫ్ ఇంజినీర్ శ్రీ సత్యనారాయణ, ఎఫ్ ఏ & సీఏవో బాలాజీ, ఎస్ఈ(ఎలక్ట్రికల్స్) వేంకటేశ్వర్లు, ట్రాన్స్పోర్టు జిఎం శేషారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్ తదితర అధికారులు పాల్గొన్నారు.