డైలీ మిర్రర్ డాట్ న్యూస్, గచ్చిబౌలి,సెప్టెంబర్ 9,2025: యువతను మాదక ద్రవ్యాల నుంచి కాపాడాలనే లక్ష్యంతో ‘డాక్ట్రెస్’ సంస్థ గచ్చిబౌలి స్టేడియంలో 5 కిలోమీటర్ల మారథాన్ నిర్వహించింది. సెప్టెంబరు 7న ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పరుగులో సుమారు 600 మందికిపైగా వైద్యులు, వైద్య విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్, పర్యాటక ,సాంస్కృతిక శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెండా ఊపి పరుగును ప్రారంభించిన అనంతరం, డాక్ట్రెస్ సంస్థ ప్రారంభించనున్న ‘గ్లోబల్ ఇండియన్ డాక్టర్స్ అలయన్స్ (GLIDA)’ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్ వాడకం యువత భవిష్యత్తుకు పెను ప్రమాదమని అభిప్రాయపడ్డారు. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని తెలిపారు.
డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు డాక్ట్రెస్ సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ప్రతి గ్రామంలోనూ నిర్వహించి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ కీర్తి శశి, శివలను మంత్రి అభినందించారు.
వైద్యుల రక్షణకు అవగాహన
ఈ మారథాన్ కార్యక్రమాన్ని టీఎస్ న్యాబ్, ఈగల్ డిపార్ట్మెంట్ల సౌజన్యంతో నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సందేశాన్ని ఇవ్వడంతో పాటు, వైద్యులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, సమాజంలో వైద్యులపై జరుగుతున్న హింసాత్మక దాడులను ఆపాలని అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం మరో ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు డాక్టర్ శ్రీకీర్తి, ఆకుల శివకృష్ణ తెలిపారు.

నవ సమాజమే ముద్దు
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన వడ్డే నవీన్, యల్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నార్కోటిక్స్ బ్యూరో డీజీ సందీప్ శాండిల్య ఆధ్వర్యంలో విభాగం అద్భుతంగా పనిచేస్తోందని నవీన్ ప్రశంసించారు. ‘డ్రగ్స్ వద్దు – నవ సమాజమే ముద్దు’ అంటూ యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
యువత సైనికులుగా మారి డ్రగ్స్ వినియోగంపై యుద్ధం చేయాలని శ్రీనివాస్ అన్నారు. సమాజం బాగుంటేనే దేశ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు. స్పోర్ట్స్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ కొలను జగ్ జీవన్ రెడ్డి, ఇతర వైద్య ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. మారథాన్లో పాల్గొన్న వారికి డాక్ట్రెస్ సంస్థ మెడల్స్తో పాటు జ్ఞాపికలను బహుకరించింది.

